న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ ( Afghanistan) లో చిక్కుకున్న భారతీయుల్ని తీసుకు వచ్చేందుకు వైమానిక దళం సీ-17 రవాణా విమానాలను సిద్ధంగా ఉంచింది. అయితే కావాల్సినంత మంది భారతీయులు కాబూల్ విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఐఏఎఫ్ విమానాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేశారు. సీ-17 విమానంలో సుమారు 250 మంది భారతీయుల్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కాబూల్ నగరం తాలిబన్ల ఆధీనంలో ఉన్నది. అయితే ఎంత మంది విమానాశ్రయానికి చేరుకుంటారో చెప్పలేం. ఎయిర్ ఇండియా విమానాలను ఆపరేట్ చేయడం కష్టంగా ఉన్న నేపథ్యంలో కేవలం వైమానిక దళ విమానాలను నడపనున్నారు. తాజా సమాచారం ప్రకారం .. సుమారు 400 మంది భారతీయుల్ని కాబూల్ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మరో వైపు ఆఫ్ఘన్ దేశస్తులు దరఖాస్తు చేసుకున్న వీసాలను కూడా కేంద్ర హోంశాఖ పరిశీలిస్తున్నది. ఇప్పటి వరకు రెండు సీ-17 విమానాలను ఐఏఎఫ్ ఆపరేట్ చేసిన విషయం తెలిసిందే.