లక్నో: వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు అఖిల భారత మజ్లిస్ ఈ ఇతేహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ప్రకటించింది. ఈ సంగతిని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్రువీకరించారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని ఆదివారం చెప్పారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంతో పొత్తు పెట్టుకోబోమని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించిన కొన్ని గంటల్లోపే అసదుద్దీన్ ఒవైసీ 100 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.
యూపీ మాజీ మంత్రి ఓపీ రాజ్భర్ సుఖ్దేవ్ సారధ్యంలోని భాగిదారి సంకల్ప్ మోర్చా (బీఎస్ఎం)తో ఎంఐఎం పొత్తు కుదుర్చుకున్నది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో విభేదాల వల్ల ఎన్డీయే కూటమి నుంచి బీఎస్ఎం బయటకు వచ్చింది.
బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు యూపీలో పోటీ చేస్తున్నది. యూపీలో ఆ పార్టీ ఎన్నికల బరిలో నిలవడం ఇదే మొదటి సారి. ముస్లింల జనాభా అధికంగా ఉన్న పశ్చిమ, సెంట్రల్, ఈస్ట్రన్ రీజియన్ల పరిధిలో అభ్యర్థులను నిలుపుతామని మజ్లిస్ యూపీ శాఖ అధ్యక్షుడు షౌకత్ అలీ చెప్పారు.
యూపీలో ప్రజాదరణ పొందిన పార్టీగా ఓపీ రాజ్భర్ సుఖ్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ).. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకున్నది. రాజ్భర్కు యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్లో మంత్రి పదవి కూడా లభించింది. కానీ విభేదాల వల్ల 2019లో బయటకు వచ్చేశారు.