న్యూఢిల్లీ : అధికంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగిన డెల్టా ప్లస్ వేరియంట్ భారత్లో థర్డ్ వేవ్కు కేంద్ర బిందువుగా మారుతుందని భావిస్తున్నారు.డెల్టా ప్లస్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే నిర్ధారణ కాగా భారత్లో ఇది ఎంతవరకూ ఆందోళనకరంగా పరిణమిస్తుందనేది ఇంకా వెల్లడి కాలేదు. డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య ఇప్పటికీ తక్కువగా ఉండటంతో దీని తీవ్రత ఇంకా వెల్లడికాలేదు. అల్ఫా వేరియంట్తో పోలిస్తే ఇది 35-60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని అంచనా వేస్తున్నారు.
భారత్లో డెల్టా ప్లస్ వేరియంట్పై అధ్యయనం సాగుతోందని, కేసుల సంఖ్య ఇక్కడ తక్కువగా ఉండటంతో ఇది ఎంత ప్రమాదకరమనేది ఇంకా వెల్లడికాలేదని ఎయిమ్స్ బయోకెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుభ్రదీప్ కర్మాకర్ చెప్పారు. ప్రతి వేరియంట్ విభిన్నమైన క్లినికల్ రెస్పాన్స్తో ముందుకొస్తుందని, గత వేరియంట్ బారినపడిన వారికి ఆక్సిజన్ స్ధాయిలు పడిపోవడం చూశామని, డెల్టా ప్లస్ వేరియంట్తో ఎలాంటి విపరిణామాలు ఎదురవుతాయనేది మనకు ఇంకా తెలియదని పేర్కొన్నారు.