న్యూఢిల్లీ : గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2.34 లక్షలు దాటడం ఆందోళన రేకెత్తిస్తోంది. భారత్ లో కొవిడ్-19 కేసుల వ్యాప్తికి పలు కారణాలున్నాయని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభం కావడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలను పాటించడం నిలిపివేశారని ఇదే సమయంలో నూతన వేరియంట్లు దేశంలో విపరీతంగా వ్యాప్తి చెందాయని అన్నారు.
కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొందని చెప్పారు. మనం తక్షణమే కేసుల సంఖ్యను కట్టడి చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. ఆస్పత్రుల్లో పడకలు, మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. దేశంలో మతపరమైన కార్యక్రమాలు, ఎన్నికలు జరుగుతున్నాయని వీటిని కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నియంత్రిత పద్ధతిలో చేపట్టాలని అన్నారు. మరోవైపు ఏ వ్యాక్సిన్ కూడా వైరస్ నుంచి వంద శాతం రక్షణ ఇవ్వదని, అయితే వ్యాక్సిన్ ద్వారా యాంటీ బాడీలు పెరిగి వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు.