న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ తప్పదనే అంచనాల నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా సానుకూల వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో అత్యధికులకు మెరుగైన రీతిలో రోగనిరోధక శక్తి ఉందని సెరోసర్వేను ఉటంకిస్తూ పేర్కొన్నారు. వైరస్ స్వభావం ఎలా మారుతుందనేది మనం అంచనా వేయలేమని..అయితే రాబోయే నెలల్లో అది అనూహ్యంగా పరివర్తన చెందేలా కనిపించడం లేదని అన్నారు.
సెరో సర్వే ప్రకారం దేశ జనాభాలో ఎక్కువ మందికి రోగనిరోధకత ప్రబలంగా ఉందని వెల్లడైందని చెప్పారు. దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రజలు విధిగా కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని డాక్టర్ గులేరియా విజ్ఞప్తి చేశారు. దేశ జనాభాలో అత్యధిక శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ రాబోయే నెలల్లో మనం జనసమ్మర్ధ ప్రాంతాల్లోకి వెళ్లకుండా, ప్రమాణాలకు దూరంగా ఉండటం వంటి నిబంధనలను పాటించాలని సూచించారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మనం థర్డ్ వేవ్ తలెత్తకుండా జాప్యం చేయడంతో పాటు థర్డ్ వేవ్ వస్తే దాన్ని తీవ్రతరం కాకుండా పరిమితం చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన తాజా సెరో సర్వేలో ఆరేండ్లు పైబడిన జనాభాలో 67.6 శాతం మందిలో కొవిడ్ యాంటీబాడీలు తయారయ్యాయని వెల్లడైంది.