కృష్ణగిరి : తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ వ్యవహారంలో నెలకొన్న గందరగోళానికి ఏఐఏడీఎంకే తెరదించింది. శశికళ తమ పార్టీలో లేరని, ఆమెను తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని ఏఐఏడీఎంకే స్పష్టం చేసింది. ఏఐఏడీఎంకేలో తిరిగి కీలక పాత్ర పోషిస్తానని శశికళ సంకేతాలు పంపిన నేపథ్యంలో ఆ పార్టీ వివరణ ఇచ్చింది. పార్టీలో ఆమెకు తిరిగి అవకాశం ఇచ్చే ప్రసక్తి లేదని ఏఐఏడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి పేర్కొన్నారు.
అయితే శశికళ పార్టీలో లేరని ఏఐఏడీఎంకే పరిణామాలతో ఆమెకు సంబంధం లేకపోయినా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మునుస్వామి అన్నారు. కాగా శశికళ తన సన్నిహితులతో ఫోన్ లో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆదివారం బయటకు రావడం కలకలం రేపింది. ఈ సంభాషణల్లో ఆమె పార్టీని చక్కదిద్దేందుకు తాను చొరవ చూపుతానని ఇద్దరు అగ్రనేతల (పన్నీర్ సెల్వం, పళనిస్వామి) మధ్య విభేదాలతో దెబ్బతిన్న పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తానని వ్యాఖ్యానించారు. పార్టీ, నేతల పేర్లు ప్రస్తావించకపోయినా ఏఐఏడీఎంకేపై తిరిగి ఆమె పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీలో చర్చ నడిచింది.