రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు వ్యాక్సిన్, బాధితులకు మందులు, ప్రాణాల రక్షణకు ఆక్సిజన్ కొరత రాకుండా రోజువారీగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర క్యాబినెట్.. పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు అధ్యక్షతన టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసింది. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి, కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్రెడ్డి సభ్యులుగా ఉంటారు.
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్పై పోరాటాన్ని తీవ్రతరంచేసింది. ఒకవైపు లాక్డౌన్ విధించడమే కాకుండా.. ఈ సమయంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు వ్యాక్సిన్, బాధితుల వైద్యానికి మందులు, ప్రాణాల రక్షణకు ఆక్సిజన్ కొరత రాకుండా రోజువారీగా పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసింది. పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి, కొవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్రెడ్డి ఈ టాస్ఫోర్స్లో సభ్యులుగా ఉంటారు.
రాష్ర్టానికి రోజువారీగా ఎంత ఆక్సిజన్ అవసరం అవుతున్నదో దవాఖానలవారీగా లెక్కలు తీసి, ఆ మేరకు సరఫరాను మెరుగుపరిచే కార్యక్రమాన్ని టాస్క్ఫోర్స్ చేపట్టనున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ రాష్ర్టానికి అవసరమైన ఆక్సిజన్ను వేగంగా తెప్పించడానికి సైనిక విమానాలు, రైల్వేలను వినియోగించారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన కోటా మేరకు ఆక్సిజన్ను తెప్పించడంతోపాటు.. రాష్ట్ర అవసరాల కోసం అవసరమైతే కేంద్రంతో మాట్లాడి అదనంగా వచ్చేలా సమన్వయంచేసుకొనే బాధ్యతను టాస్క్ఫోర్స్ నిర్వహించనున్నది.
రాష్ట్రంలో వాక్సినేషన్ను కూడా త్వరగా పూర్తిచేయాలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇందుకోసం రాష్ర్టానికి వీలైనన్ని ఎక్కువ డోస్ల వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాలు వేగంగా మొదలయ్యాయి. రాష్ట్రంలో అందరికీ రాష్ట్ర ప్రభుత్వమే వ్యాక్సిన్ వేయిస్తుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టతనిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ర్టానికి రోజువారీగా వచ్చే కోటా ఎక్కువగా ఉండేలా మానిటరింగ్ చేయడం, వ్యాక్సిన్ తయారీ సంస్థలతో మాట్లాడి నేరుగా రాష్ర్టానికి కావాల్సిన వ్యాక్సిన్ వచ్చేలా చేసే బాధ్యతలను టాస్క్ఫోర్స్ చేపడుతుంది. వ్యాక్సిన్ కోసం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇప్పటికే గ్లోబల్ టెండర్లను పిలవాలని నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా ఈ టాస్క్ఫోర్స్ మానిటరింగ్ చేయనున్నది.
కరోనా వైద్యానికి ఉపయోగించే రెమ్డెసివిర్ లాంటి మందుల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. వాటిని బ్లాక్లో విక్రయిస్తున్నారు. ఇలాంటి బ్లాక్ దందాలను అరికట్టి, ప్ర భుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో కరోనా వైద్యానికి అవసరమయ్యే మందుల కొరత లేకుండా ఈ టాస్క్ఫోర్స్ రెగ్యులర్గా మానిటరింగ్ చేయనున్నది. మెడికల్ కిట్ల సరఫరాలో ఎలాంటి అవరోధాలు లేకుండా చూస్తుంది. రోజువారీగా మందుల కొనుగోలు, సరఫరా, పంపిణీపై టాస్క్ఫోర్స్ ప్రత్యేకంగా మానిటరింగ్ చేయనున్నది.