ఇంతకంటే దారుణం మరోటి ఉంటుందా? స్టార్ హీరోతో ఆయన తీసిన సినిమా విడుదలకు సిద్ధం అవుతుండగా ఓ దర్శకుడి జీవితంతో విధి ఆడుకుంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతనే తమిళ దర్శకుడు జననాథన్.
తమిళనాట ‘లాభం’ అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది. దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. ఈ పనుల్లోనే కొన్ని రోజులుగా చాలా బిజీగా ఉన్నాడు దర్శకుడు జననాథన్. అయితే ఉన్నట్లుండి ఇప్పుడు ఈయన ఆస్పత్రి పాలయ్యాడు. అనుకోకుండా ఈయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం అత్యంత విషమ పరిస్థితుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు జననాథన్. ప్రాణాలతో పోరాడుతున్నాడు ఈ దర్శకుడు. ఈ విషయం తెలుసుకుని తమిళ సినీ ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే జననాథన్ జాతీయ అవార్డు సొంతం చేసుకున్న దర్శకుడు కావడం గమనార్హం. 2003లో ఈయన తెరకెక్కించిన ‘ఇయర్కై’ సినిమా ఆ ఏడాదికి గానూ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డు సాధించింది. 61 ఏళ్ల జననాథన్ ఇప్పటి వరకు తమిళంలో నాలుగు సినిమాలు తెరకెక్కించాడు.
లాభంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించాడు. శ్రుతి హాసన్ హీరోయిన్. అంతేకాదు తెలుగు హీరో జగపతిబాబు ఇందులో విలన్ పాత్రలో నటించాడు. వ్యవసాయంలో దళారుల దందా నేపథ్యంలో నడిచే కథ ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
గతేడాది విడుదల కావాల్సిన సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత షూటింగ్ పూర్తి చేశాడు జననాథన్. సమ్మర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్న సమయంలోనే ఇలా జరిగిపోయింది. సినిమా కోసం కొన్ని రోజులుగా రేయింబవళ్లు ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా కష్టపడుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటున్నాడు. ఆ కారణంగానే మార్చి 11న ఉదయం ఎడిటింగ్ పనులను చూసుకుని భోజనం కోసం ఇంటికి వెళ్లాడు. వెళ్లిన మనిషి మళ్లీ తిరిగి రాకపోవడంతో అసిస్టెంట్స్ ఫోన్ చేశారు. అయినా కూడా స్పందన లేదు. దాంతో ఇంటికి వెళ్లి చూస్తే స్పృహ లేకుండా పడి ఉన్నాడు. దాంతో సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెంటనే తరలించారు. జననాథన్ మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారు. ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.