స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వస్తున్న ప్రజలు
ప్రభుత్వం ఉచితంగా టీకాలు ఇవ్వడంపై హర్షం
తాంసి, మార్చి 30 : రాష్ట్రంలో కొవిడ్ వైరస్ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ సెంటర్లకు జనం నుంచి విశేష స్పందన వస్తున్నది. 45 ఏళ్లు దాటిన వారందరూ స్వచ్ఛందంగా ముందుకు కదులుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకుని ఆనందంతో వెళ్తున్నారు.
15 కేంద్రాల్లో వ్యాక్సినేషన్..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ దవాఖాన, ఉట్నూర్ ఏరియా దవాఖాన, మరో 15 పీహెచ్సీల్లో వ్యాక్సినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. లాక్డౌన్ సమయంలో ముందుండి కొవిడ్ పేషెంట్స్కు సేవలందించిన వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులకు ఈ వ్యాక్సిన్ వేశారు. మొదటి, రెండో డోసులు పూర్తయ్యాయి. ఇప్పడు సామాన్య ప్రజలకు టీకాలు వేస్తున్నారు. 45 ఏళ్లు పైబడిన వారికి వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్వచ్ఛందంగా కదులుతున్న జనం…
వ్యాక్సిన్ వేయించుకునేందుకు జనం స్వచ్ఛందంగా సెంటర్లకు వెళ్తున్నారు. టీకాపై అపోహలు వీడాలని, వ్యాక్సిన్ వేయించుకుని కరోనా బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ప్రజలు టీకాలు వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్తో చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.