దుబ్బాక, మార్చి 30 :ఎడారిగా ఉన్న కూడవెల్లిని గోదారి జలాలతో నిండు కుండలా మార్చడమే గాకా, యాసంగి పంటకు సాగు నీళ్లు అందించి రైతన్నల కన్నీళ్లు తుడిచిన ఘనత సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కారుదేనని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడో ఉన్న గోదావరి జలాలు దుబ్బాక నియోజకవర్గంలో పారడం ఇదొక మహా అద్భుత ఘట్టమని కొనియాడారు. మంగళవారం దుబ్బాక మండలం ఆకారం శివారులో కూడవెల్లి వంతెన వద్ద గోదావరి జలాలకు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పూజలు చేశారు. గోదారమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గంగపుత్రులు తెప్పొత్సవం నిర్వహించారు. అనంతరం ఎంపీ కొత్తప్రభాకర్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మండుటెండల్లో కూడవెల్లి పొంగిపొర్లడం అద్భుత దృశ్యమన్నారు. 54కిలో మీటర్ల దూరంలో ఉన్న చేబర్తి నుంచి దుబ్బాకలోని కూడవెల్లి వాగుకు జలాలను తరలించడం ఆషామాషీ కాదన్నారు.
కూడవెల్లికి నేడు జలకళ సంతరించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావులే కారణమన్నారు. కూడవెల్లితో సిద్దిపేట జిల్లా రైతులకే కాకుండా కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సాగు నీరందించినట్లు తెలిపారు. ‘తెలంగాణ వస్తే కేసీఆర్ ఎం చేస్తాడు.. అని ప్రశ్నించినోళ్లు.. ఈ కూడవెల్లికి వచ్చి చూస్తే కనిపిస్తుంది.. టీఆర్ఎస్ పని చేసే ప్రభుత్వం.. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచురించినంత మాత్రానా, నిజాలు ఏనాటికి అబద్ధం కావు.. ఒక దృక్పథం.. ఒక లక్ష్యంతో సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగుతున్నది’.. అని అన్నారు. యాసంగిలో సాగు నీటి కష్టాలు తొలగించడమే గాకా, మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. కూడవెల్లి ఇక నుంచి జీవనదిగా మారిందన్నారు. మల్లన్నసాగర్ ద్వారా జిల్లాలో చెరువు, కుంటలు పొంగిపొర్లుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. మండుటెండలో చెరువు, కుంటలు, వాగుల్లో పారుతున్న నీళ్లను చూసి, ఆ నాయకులు నీళ్లు మింగుతున్నారని ఎద్దేవా చేశారు. తమకు ప్రజా సంక్షేమం తప్ప, దిగజారుడు రాజకీయాలు అవసరం లేదన్నారు.
ఆ పార్టీలను ప్రజలు నమ్మరు..
టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను చూసి ఓర్వలేని కొందరు పని గట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీల నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా, టీఆర్ఎస్ ముందు పని చేయవన్నారు. అబద్ధాలతో ఎల్లకాలం గడువదని, ప్రజలు అన్ని చూస్తున్నారని, త్వరలోనే ఆ అబద్ధాల నాయకులకు బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితారెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కైలాస్, టీఆర్ఎస్ నాయకులు రొట్టే రాజమౌళి, కిషన్రెడ్డి, మల్లారెడ్డి, బాలకిషన్, బండి రాజు, దయాకర్, కుమార్, శ్రీనివాస్రెడ్డి, నారాగౌడ్, తిరుపతిరెడ్డి, కిషన్, నగరం రవి, చంద్రసాగర్, మల్లేశం, తదితరులున్నారు.
ఎల్లమ్మ దేవాలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు..
దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి ఎల్లమ్మ దేవాలయంలో మంగళవారం అమ్మవారి కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం సర్పంచ్ రాజిరెడ్డి, దేవాలయ పాలకవర్గం ఎంపీని సన్మానించారు. అచ్చుమాయపల్లి మదిర గ్రామం పరశురాం నగర్లో పెద్దమ్మ దేవాలయ వార్షికోత్సవ పూజల్లో ఎంపీ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంటకయ్య, నాయకులు ఎల్లారెడ్డి, రామస్వామిగౌడ్, సంజీవ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, దేవరాజ్, ప్రభాకర్ ఉన్నారు.
ఇవీ కూడా చదవండి..
ఇది తింటే.. కేవలం 4 గంటల్లోనే షుగర్ తగ్గుతుందట..!
స్మోకింగ్, డ్రింకింగ్ మానేయాలా..? రోజూ అయితే ఇలా చేయండి