న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) శరణార్థుల హై కమిషనర్ కార్యాలయం ఎదుట ఆఫ్ఘన్ శరణార్థులు సోమవారం నిరసన తెలిపారు. ప్రస్తుతం తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు, తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లోని ఆఫ్ఘన్ల శరణార్థులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, తమ కుటుంబాలను ఆదుకోవాలని, మూడవ దేశంలో పునరావాసం ఎంపిక, UNHCR, భారత ప్రభుత్వం నుంచి భద్రతకు భరోసా వంటి డిమాండ్లను ప్రస్తావించారు. ఈ మేరకు పలు ఫ్లకార్డులు ప్రదర్శించారు.
మరోవైపు భారత్లో 21,000 మందికి పైగా ఆఫ్ఘన్ శరణార్థులు ఉన్నారని భారత్లోని ఆఫ్ఘన్ కమ్యూనిటీ హెడ్ అహ్మద్ జియా ఘని తెలిపారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్కు తిరిగి వెళ్లేందుకు తగిన పరిస్థితులు, కారణాలు లేవన్నారు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ శరణార్థులకు పూర్తి స్థాయిలో పునరావాసం, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.