మంత్రి కేటీఆర్కు అడుగడుగునా జననీరాజనం02
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
నూతన బస్టాండ్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఖమ్మం, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యువనేత, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన విజయవంతమైంది. మంత్రి కేటీఆర్తోపాటు ఉదయం 10:15 గంటలకు ఖమ్మం పటేల్ స్టేడియానికి హెలికాఫ్టర్ ద్వారా మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. మంత్రులకు జిల్లా అధికారులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం నగరంలో దాదాపు నాలుగున్నర గంటలపాటు పర్యటించిన మంత్రులు రూ.423 కోట్లతో నిర్మించిన, నిర్మించనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఖమ్మం, సత్తుపల్లిల్లో మంత్రుల పర్యటనకు ప్రజలు నీరాజనాలు పలికారు.
ఖమ్మం నూతన బస్టాండ్లో జరిగిన బహిరంగ సభకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. మంత్రులు అజయ్కుమార్, ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావులతో కలిసి ఖమ్మం నగరంలో రూ.36 కోట్లతో నిర్మించనున్న ఐటీ హబ్ రెండో దశ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొత్త కలెక్టరేట్ వీ వెంకటాయపాలెం వరకు రూ.35 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. రూ.30 కోట్లతో ఖమ్మంలో నిర్మించే సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. టేకులపల్లిలో ఆధునిక హంగులతో నిర్మించిన 1004 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. రూ.229.95 కోట్లతో ఏర్పాటు చేసిన 85 వేల మంచినీటి కనెక్షన్లకు ప్రతిరోజూ మంచినీరు సరఫరా చేసే పథకాన్ని ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో రూ.25 కోట్లతో నిర్మించిన నూతన ఆర్టీసీ బస్టాండ్ను ప్రజల కరతాళ ధ్వనుల మధ్య మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
హైదరాబాద్లోని ఎంజీబీఎస్ తర్వాత ఖమ్మం నూతన బస్టాండే పెద్దదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రకటించారు. అనంతరం రూ.2 కోట్లతో ఆధునీకరించిన ఖమ్మం కాల్వొడ్డులో గల వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్తోపాటు మంత్రులు, ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు రాములునాయక్, కందాల ఉపేందర్రెడ్డి, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మధిర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు మల్లాది వాసు, మున్సిపల్ కౌన్సిలర్ అయిన ఆయన సతీమణి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఖమ్మం మున్సిపల్ మాజీ చైర్మన్, దివంగత కాంగ్రెస్ నేత రాపర్తి రంగారావు కుటుంబసభ్యులు రాపర్తి శరత్ నాయకత్వంలో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పటేల్ స్టేడియానికి వచ్చి హెలికాఫ్టర్ ద్వారా సత్తుపల్లికి చేరుకున్నారు. రూ.3.11 కోట్లతో నిర్మించిన సత్తుపల్లి నూతన మున్సిపల్ కార్యాలయాన్ని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్, వేముల ప్రశాంత్రెడ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించారు. రూ.2 కోట్లతో నిర్మించనున్న సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలను తీర్చడంలో తెలంగాణ ప్రభుత్వం అగ్రగామిగా ఉందని అన్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ హయాంలోనే జిల్లా రూపురేఖలు మారాయని, అన్ని ప్రాంతాల్లోనూ అభివృద్ధి విరాజిల్లుతోందని స్పష్టం చేశారు. మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు.