న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని కరోనా నాలుగో దశ వణికిస్తున్నది. కరోనా బారినపడి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్న ప్రముఖ వ్యక్తులు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి క్యూకడుతున్నారు. దీంతో ఎమర్జెన్సీ వార్డుల్లో కరోనా రోగుల సంఖ్యతోపాటు ఆక్సిజన్ అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ పైప్లైన్లను ఆ మేరకు ఏర్పాటు చేసేందుకు శనివారం ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ వార్డుల్లో గంటపాటు అడ్మిషన్లు నిలిపివేశారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డుల్లో వంద మందికిపైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.