న్యూఢిల్లీ, మే 13: దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకున్నది. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేసింది. జూన్ 27న జరుగాల్సిన పరీక్షలను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తదితర అఖిల భారత సర్వీసు అధికారుల నియామకానికి యూపీఎస్సీ ఏటా మూడు దశల్లో (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) పరీక్షలను నిర్వహిస్తుంది. గతేడాది కూడా కరోనా కారణంగా యూపీఎస్సీ పరీక్షలు వాయిదాపడ్డాయి. మేలో జరుగాల్సిన పరీక్షలను అక్టోబర్లో నిర్వహించారు. రాత పరీక్షలు పూర్తయినా.. ఇంటర్వ్యూలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. గత నెల 24 నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభం కావాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడ్డాయి. తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉన్నది.