న్యూఢిల్లీ: కొవిడ్ బారి నుంచి కోలుకున్న వారిని ఆ తర్వాత ఫంగస్లు వేధిస్తున్నాయి. ఇప్పటికే వారిలో బ్లాక్, వైట్ ఫంగస్ ఆనవాళ్లను గుర్తించగా, తాజాగా కొందరిలో యెల్లో ఫంగస్ ఆనవాళ్లు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ యెల్లో ఫంగస్ నుంచి రోగులు కోలుకోవడానికి ఆంఫోటెరిసిన్-బి అనే ఇంజెక్షన్ బాగా పనిచేస్తుంది. అందుకే కేంద్ర సర్కారు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర సంస్థలకు ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ బుడ్డీలను సరఫరా చేస్తున్నది.
ఇప్పటికే ఈ నెల 21న 23,680 ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ బుడ్డీలను రాష్ట్రాలకు సరఫరా చేసిన కేంద్రం, ఈ నెల 24న మరో 19,420 బుడ్డీలను సప్లయ్ చేసిందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ వెల్లడించింది. తాజాగా పంపిణీ చేసిన ఇంజెక్షన్ బుడ్డీల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్కు సరఫరా చేశారు.