పుణె: భారత్లోని ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సీరం సంస్థ సీఈవో ఆధార్ పూణావాలా తన మద్దతు పలికారు. ఆరోగ్యం, గౌరవం అనేవి ప్రాథమిక మానవ హక్కులని , అదే తాను విశ్వసిస్తున్నట్లు పూణావాలా తెలిపారు. ట్రాన్స్జెండర్ కార్యకర్త లక్ష్మీ నారాయన్ త్రిపాఠికి ఇవాళ కోవిడ్ టీకా ఇచ్చారు. ఈ సందర్భంగా పూణావాలా ఆ ఫోటోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. దేశంలోని ట్రాన్స్జెండర్ వర్గీయులకు సమాన అవకాశాలు కల్పిస్తామని ఆధార్ పూణావాలా తన ట్వీట్లో తెలిపారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ, ఆస్ట్రాజెనికా సహకారంతో సీరం సంస్థ కోవీషీల్డ్ టీకాలను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే.
లక్ష్మీ నారాయణ త్రిపాఠి ప్రముఖ ట్రాన్స్జెండర్ కార్యకర్త. ఆ వర్గం అభివృద్ధి కోసం త్రిపాఠి ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 25వేల మంది ట్రాన్స్జెండర్లు టీకాలు తీసుకున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో 4.87 లక్షల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ట్రాన్స్జెండర్లను వివక్షతో చూడవద్దు అని ఇటీవల కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.