న్యూఢిల్లీ: అదానీ గ్రూప్( Adani Ports ) కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల 13న గుజరాత్లోని అదానీ గ్రూప్ నడిపే ముంద్రా పోర్ట్లో 3 వేల కిలోల హెరాయిన్ సీజ్ పట్టుబడిన విషయం తెలుసు కదా. దీని విలువ సుమారు రూ.20 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ భారీ డ్రగ్ స్కామ్తో షాక్ తిన్న అదానీ పోర్ట్స్.. నవంబర్ 15 నుంచీ ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ల నుంచి వచ్చే కార్గోలను హ్యాండిల్ చేయబోమని స్పష్టం చేసింది. థర్డ్ పార్టీ టెర్మినల్స్ సహా అదానీ పోర్ట్స్ నిర్వహించే అన్ని టెర్మినల్స్కూ ఇది వర్తిస్తుందని అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.
గత నెలలో దొరికిన డ్రగ్స్ కన్సైన్మెంట్ ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద అక్రమ ఒపియం రవాణాదారుల్లో ఒకటి ఆఫ్ఘనిస్థాన్కు పేరుంది. ప్రాసెస్ చేయని టాల్కమ్ పౌడర్ అంటూ పెద్ద పెద్ద బ్యాగులలో ఈ హెరాయిన్ను తరలించారు. పైన టాల్కమ్ పౌడర్ రాళ్లను పెట్టి, కింది భాగంలో డ్రగ్స్ ఉంచారు. ఈ భారీ అక్రమ రవాణా వెలుగు చూసిన తర్వాత దేశవ్యాప్తంగా సోదాలు జరిగాయి. ఆఫ్ఘన్, ఉజ్బెకిస్తాన్లకు చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు.