హైదరాబాద్: రైతన్న లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సినిమా రంగంలో రైతన్నల జీవితంపై సినిమా నిర్మాణం గొప్ప విషయమని చెప్పారు. రైతన్నల పట్ల అభిమానం ఉన్న ప్రతీఒక్కరూ సినిమా చూడాలన్నారు. మినిస్టర్స్ క్వార్టర్స్లో ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్ నారాయణ మూర్తి నిర్మించిన రైతన్న సినిమా ఈ నెల 14న విడుదల కానుందని చెప్పారు. ఎన్నో కష్టాలకు ఓర్చి ఈ సినిమాను నిర్మించారని తెలిపారు. రైతన్నల నిజజీవితంలో కష్టనష్టాలను ఈ సినిమాలో చూపించారని వెల్లడించారు. తెలుగులో ప్రత్యామ్నాయ సినిమాలు రూపొందించడంలో నారాయణమూర్తి ముందున్నారు. అంతిమంగా రైతుకు ప్రయోజనం కలగాలన్నదే ఆయన ధ్యేయమన్నారు.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగుచట్టాలు రైతులకు వరాలు కాదని, శాపాలని ఆర్ నారాయణ మూర్తి విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తామన్న బీజేపీ మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మూడు వ్యవసాయ చట్టాలను కార్పొరేట్ల కోసమే రూపొందించదని ఆరోపించారు. వివాదాస్పద చట్టాలతో రైతులు బానిసలుగా మారుతారని, వారికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ చట్టాలతో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. రైతు బంధు పథకం అమలుచేస్తున్న సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని కేసీఆర్ నిరూపించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నారని వెల్లడించారు. తాను 36 ఏండ్లుగా ప్రజా సమస్యలపై స్పందించి సినిమాలు రూపొందిస్తున్నాని నారాయణ మూర్తి అన్నారు.