జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వం ఇటీవల చేసిన ఒక బిల్లు వివాదాలకు దారితీస్తోంది. రాష్ట్రంలో జరిగే వివాహాలన్నింటినీ ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయాలని ఈ చట్టం చెబుతోంది. వీటిలో బాల్యవివాహాలను కూడా చేర్చడం వివాదాలకు కేంద్రంగా మారింది. బాల్యవివాహాలను బాలిక తల్లిదండ్రులు లేదంటే గార్డియన్ నమోదు చేయాలని ఈ చట్టంలో ఉంది. అయితే ఈ చట్టం వల్ల బాల్యవివాహాలకు చట్టబద్ధత లభించినట్లే అవుతుందని సామాజిక కార్యకర్తలు, ఎన్జీవోలు మండిపడుతున్నాయి.
బాల్యవివాహం అనే ఆచారం చాలా ఘోరమైనదని, ఇది పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తుందని వారు వాపోతున్నారు. అందుకే బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఎన్నో ఏళ్లుగా సంస్కరణలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ వివాహాలు జరగకుండా నిలువరించాల్సిన ప్రభుత్వం ఇలాంటి చట్టాలను చేయడం అంటే బాల్యవివాహాలను దొడ్డిదారిలో సమర్థించినట్లే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అన్ని వివాహాలను రిజిస్టర్ చేయాలనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే తాము ఈ చట్టం చేశామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం సమాజంలో బాల్యవివాహాల ఆచారం పూర్తిగా తొలగిపోలేదని, ఇలాంటి పెళ్లిళ్ల వల్ల జీవితం కోల్పోయిన చిన్నారులను కాపాడేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని అంటోంది. దీనిపై బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ సంగీతా బెనివాల్ స్పందించారు. తాజా చట్టం ద్వారా బాల్యవివాహాలను సమర్థించడం, చట్టబద్ధం చేయడం ప్రభుత్వ ఉద్యేశ్యం కాదని బెనివాల్ చెప్పారు.
‘‘ఒక బాల్యవివాహంలో చిన్నతనంలో భర్తను కోల్పోయిన బాలిక పరిస్థితి ఏంటి? మెట్టింట్లో ఆమెకు హక్కులు లభించేలా ఎవరు చేస్తారు? ఈ చట్టం చేసింది మహిళల హక్కులను పరిరక్షించేందుకు, బాల్యవివాహాలను ప్రోత్సహించడం కోసం కాదు’’ అని ఆమె స్పష్టం చేశారు.
కాగా, రాజస్థాన్ రాష్ట్రంలో బాల్యవివాహాల సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. 2016లో 65 శాతం బాల్యవివాహాలు నమోదవగా ఇది ప్రస్తుతం 35 శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే చాలా బాల్యవివాహాలు ప్రభుత్వం దృష్టికి రాకపోవడం వల్లే ఈ సంఖ్య తగ్గిందని, అంతేగానీ ఈ వివాహాలు పెద్దగా తగ్గలేదని కొందరు సామాజిక కార్యకర్తలు అంటున్నారు.