నర్సంపేట/చెన్నారావుపేట/దుగ్గొండి/నర్సంపేట రూరల్/ఆత్మకూరు/శాయంపేట/నెక్కొండ, మే 7: కరోనా బాధితులకు నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని నర్సంపేట ఏరియా దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ జాన్సన్ తెలిపారు. శుక్రవారం దవాఖాన ఆవరణలో కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ను పరిశీలించి మాట్లాడారు. నర్సంపేట ఏరియా దవాఖానలో 30 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 49 మందికి టెస్టులు చేయగా, 20 మందికి పాజిటివ్ వచ్చిందని, 66 మందికి మొదటి డోసు, 34 మందికి రెండో డోసు వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. చెన్నారావుపేటని పీహెచ్సీని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ ప్రకాశ్ సందర్శించి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు. 106 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు వైద్యాధికారి ఉషారాణి తెలిపారు. దుగ్గొండి, కేశవాపురం పీహెచ్సీల పరిధిలో ఇంటింటా జ్వర సర్వే చేశామని వైద్యాధికారులు స్వప్న, రాజు తెలిపారు. కేశవాపురంలో 66 మందికి, దుగ్గొండిలో 70 మందికి వ్యాక్సిన్ వేశారు. నర్సంపేట మండలంలోని భాంజీపేట పీహెచ్సీలో వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి భూపేశ్ తెలిపారు. ఆత్మకూరులో నిత్యం 100 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వైద్యాధికారి రణధీర్ తెలిపారు. 70 మందికి పరీక్షలు చేయగా, 19 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. శాయంపేటలో 25 మందికి పరీక్షలు చేస్తే 10 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి నాగశశికాంత్ తెలిపారు. పర్వతగిరిలో 15 మందికి పాజిటివ్ వచ్చినట్లు సీహెచ్ఎన్ సుజాత తెలిపారు. 110 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. నెక్కొండలోని పీహెచ్సీలో 25 మందికి పరీక్షలు చేయగా, ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి రమేశ్ తెలిపారు. 36 మందికి వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. అలంకానిపేట పీహెచ్సీ పరిధిలో నలుగురికి పాజిటివ్ రాగా, 40 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి సుమంత్ తెలిపారు.