పేదలు, బహుజన వర్గాలు ఎదగడం వాళ్లకు ఇష్టం లేదు
అఖిలపక్ష మీటింగ్ బహిష్కరణ అప్రజాస్వామికం
సలహాలు ఇచ్చేందుకు అభ్యంతరమెందుకు..?
బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం ధ్వజం
హుజూరాబాద్, జూన్ 27: వెయ్యి కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం కోసం విధివిధానాల ఖరారుకు నిర్వహించిన అఖిల పక్ష సమావేశాన్ని బహిష్కరించి.. దళిత వ్యతిరేకిగా బీజేపీ మిగిలిపోయిందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు విమర్శించారు. బీజేపీ తీరు చూస్తుంటే దళితులు ఎదగడం ఇష్టం లేనట్లేనని అర్థమవుతుందని మండిపడ్డారు. హుజూరాబాద్ పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దళితుల సమగ్ర వికాసమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాన్ని రూపొందించి, విధివిధానాల ఖరారుకు బీజేపీని ఆహ్వానిస్తే ఎందుకు దూరంగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది దళిత, బహుజన వర్గాల వ్యతిరేక చర్యనే అవుతుందని, అఖిలపక్షాన్ని బహిష్కరించడం అప్రజాస్వామ్యమని మండిపడ్డారు.
నిజానికి ఆ వర్గాల సంక్షేమం, అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే సమావేశాల్లో పాల్గొని తగిన సలహాలు, సూచనలు ఇస్తే గౌరవ ప్రదంగా ఉండేదని సూచించారు. దళితుల కుటుంబాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎస్సీ సబ్ప్లాన్ నిధులకు అదనంగా రూ. వెయ్యి కోట్లు వెచ్చించి దళిత సాధికారత పథకానికి శ్రీకారం చుట్టారని, దీనిపై అభినందించాల్సి పోయి సమావేశాలకు గైర్హాజరు కావడంతో దళిత వ్యతిరేకులుగా మిగిలిపోతారన్నారు. బలహీన వర్గాల గొంతుకగా చెప్పుకునే బీజేపీ నాయకులు.. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఈటల అయితే సంక్షేమ పథకాలను పరిగె ఏరుకున్నట్లు హేళన చేశారని, ఇక విప్ బాల్క సుమన్ను బానిస సుమన్గా ఎమ్మెల్యే రఘునందన్రావు అవమానించడం దళితుల, బహుజనులపై బీజేపీకి ప్రేమ ఎంత ఉందో తెలుస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ సిద్ధాంత భూమికలోనే ఫ్యూడల్ మనస్తత్వం దాగి ఉందని, ఆ పార్టీ చర్యలు, నేతల వైఖరి స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి బహుజన, దళిత వ్యతిరేకి అయిన బీజేపీకి వచ్చే ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక్కడ నాయకులు తునికి సమ్మయ్య, బత్తుల రాజలింగం, రావుల అశోక్, కొండ్ర నరేశ్, తొగరు భిక్షపతి, బత్తుల తిరుపతి, ఇమ్రాన్, ఖాలీద్, మొలుగు శ్రీనివాస్, మొలుగు అనిల్, బొడ్డు సంజీవ్, ఇమ్మడి రాజయ్య తదితరులు ఉన్నారు.