భారత్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో ప్రతిరోజు 3 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం.. బుధవారం ఒక్కరోజే 3,79,257 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా మహారాష్ట్ర, కేరళలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గడిచిన 24 గంటల్లో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం సాయంత్రం వరకు మహారాష్ట్రలో 66,159 కరోనా కేసులు, 771 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,39,553కు, మొత్తం మరణాల సంఖ్య 67,985కు పెరిగింది.
ఇక కేరళలో గడిచిన 24 గంటల్లో మొత్తం 38,607 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకేరోజు ఇంత భారీస్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు. ఇదిలావుంటే, గడిచిన 24 గంటల వ్యవధిలో 48 కరోనా మరణాలు కూడా నమోదయ్యాయని పినరయి విజయన్ చెప్పారు.
ప్రస్తుతం భారత్లో 30,84,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,04,832 మంది కరోనాతో మరణించారు. అయితే ఇప్పుడు దేశంలో కరోనా రికవరీ రేటు 82.10 శాతంగా రికవరీ రేటు ఉంది.