నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు గాయాలయ్యాయి. అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన వీరు అగ్నికీలల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత సోమవారం రాత్రి సైతం దోమలపెంట సమీపంలో అడవికి నిప్పంటుకుంది. వెంటనే రెండు అటవీశాఖ బృందాలతోపాటు 10 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని బ్లోయర్లు, డౌసింగ్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. గడ్డికి నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించి అడవికి నష్టం వాటిల్లింది.