కోల్ కతా : దేశంలోని అన్ని ప్రాంతాలకూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) విస్తరిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ వెల్లడించారు. రాబోయే నెలరోజుల్లో విస్తరణ ప్రణాళికలతో పార్టీ ముందుకొస్తుందని చెప్పారు. బీజేపీని దేశంలోని అన్ని ప్రాంతాల్లో టీఎంసీ ఢీ కొంటుందని సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీదీ మేనల్లుడు పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన ఎంపికపై బీజేపీ చేసిన బంధుప్రీతి ఆరోపణలను అభిషేక్ బెనర్జీ తోసిపుచ్చారు.
ఒక కుటుంబం నుంచి ఒకరే రాజకీయాల్లో ఉండాలని పార్లమెంట్ లో చట్టం తీసుకువస్తే తాను పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రాబోయే 20 ఏండ్లలో మంత్రి పదవి సహా ప్రభుత్వంలో ఎలాంటి పదవి చేపట్టాలన్న ఉద్దేశం తనకు లేదని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఎదుగుదలకు పనిచేస్తానని తేల్చిచెప్పారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీని ఎదుర్కొన్న మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి అధికార పగ్గాలను చేపట్టిన సంగతి తెలిసిందే.