కోల్కతా, సెప్టెంబర్ 23: రానున్న మూడేండ్లలో బీజేపీని దేశం నుంచి తరిమికొట్టడమే తన లక్ష్యమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చెప్పారు. ముర్షిదాబాద్ జిల్లాలోని సంసీర్గంజ్, జాంగీపూర్ నియోజకవర్గాలకు త్వరలో ఉప ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘వచ్చే మూడేండ్లలో దేశంలో బీజేపీ లేకుండా చేయడమే నా లక్ష్యం. ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ర్టానికి వెళ్తాం. అక్కడ బీజేపీని ఓడించడానికి శాయశక్తుల కృషి చేస్తాం. వారి (బీజేపీ) ఈడీ, సీబీఐ ఏమీ చేయలేవు’ అని అన్నారు. కేవలం ప్రాంతాలు, జిల్లాల పేర్లు మార్చడమే బీజేపీ అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. ఒకవేళ ముర్షిదాబాద్లో బీజేపీ గెలిస్తే.. ముర్షిదాబాద్ పేరును మోదీషాబాద్గా మార్చుతారని పేర్కొన్నారు.