న్యూఢిల్లీ : మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. కోల్కతాలో గత నెలలో అభిషేక్ బెనర్జీని అభిజిత్ ముఖర్జీ కలిశారు. ఈ క్రమంలో టీఎంసీ నేతలతో అభిజిత్ పార్టీ మారే విషయంపై సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. మొత్తానికి పార్టీ మారే విషయంపై మరికాసేపట్లో స్పష్టత రానుంది. అభిజిత్ కాంగ్రెస్ పార్టీని వీడి టీఎంసీలో చేరితే.. హస్తం పార్టీకి భారీ నష్టమే అని చెప్పాలి.
ఇక, ఇటీవల ఫేక్ వ్యాక్సిన్ వివాదానికి సంబంధించి మమతా బెనర్జీకి మద్దతుగా అభిజిత్ ట్విట్టర్ వేదికగా తన వాయిస్ వినిపించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని మోదీ సర్కార్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీంతో అభిజిత్ తృణమూల్ చేరతారనే ప్రచారం మరోసారి ఊపందుకుంది.