చండీఘడ్ : పపీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి పంజాబ్ కు పంపిన వెంటిలేటర్లు ఎందుకూ పనికిరాకుండా మూలనపడ్డాయి. ఈ వెంటిలేటర్లు పనిచేసేలా చొరవ చూపాలని ఆప్ ఎమ్మెల్యే కుల్తర్ సింగ్ సంధ్వాన్ పంజాబ్ సర్కార్ ను కోరుతూ ట్విటర్ లో ఫోటోలు షేర్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఫరీద్ కోట్ లోని గురు గోవింద్ సింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (జీజీఎస్ఎంసీహెచ్) వెంటిలేటర్లను ఉపయోగించకుండా పక్కనపెట్టారని ఆప్ ఎమ్మెల్యే పంజాబ్ ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై సత్వరమే చర్యలు చేపట్టాలని సీఎం అమరీందర్ సింగ్ ను కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.
ఈ ఉదంతంపై బాబా ఫరీద్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ డాక్టర్ రాజ్ బహుదూర్ స్పందించారు. తమకు సరఫరా చేసిన వెంటిలేటర్లు చాలా వరకూ పనిచేయని నాసిరకం మెషీన్లు ఉన్నాయని పేర్కొన్నారు. పీఎం కేర్స్ ఫండ్ నుంచి తమకు 82 వెంటిలేటర్లు పంపగా, 62 వెంటిలేటర్లు తొలి నుంచీ పనిచేయడం లేదని చెప్పారు. తమకు కేంద్ర ప్రభుత్వం పంపిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉన్నాయని, అవి ఒకటి రెండు గంటలు మాత్రమే పనిచేస్తున్నాయని దవాఖానకు చెందిన ఐసీయూ డాక్టర్లు, వైద్య సిబ్బంది తెలిపారు. పనిచేసే కొద్ది వెంటిలేటర్లలో కూడా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. సరైన మరమ్మత్తులు చేపడితేనే తాము వీటిని రోగులకు వాడలేమని వీసీ రాజ్ బహుదూర్ తెలిపారు.