న్యూఢిల్లీ : కొవిడ్-19 కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని పాలక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ కోరారు. కరోనా సెకండ్ వేవ్ లో రోగులకు తాను, ఆప్ సర్కార్ ఎలాంటి సాయం చేయలేకపోతోందని మతియ మహల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇక్బాల్ అశక్తత వ్యక్తం చేశారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి ఆప్ టికెట్ పై పోటీ చేసి గెలుపొందారు. తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా కరోనా రోగులకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నానని, ఎమ్మెల్యేగా ఉన్నందుకు విచారిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీ హైకోర్టును ఆయన అభ్యర్ధించారు. ఢిల్లీ పరిస్థితి దయనీయంగా ఉందని, రోడ్డుపై మృతదేహాలు కనిపిస్తున్నాయని ఆప్ ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్-19తో మరణిస్తున్న ప్రజలను కాపాడటమే మన ముందున్న ప్రాధాన్యతని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలన్న తన డిమాండ్ పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇతర దేశాల నుంచి సాయాన్ని కేంద్రం అనుమతిస్తుంటే ప్రజలను కాపాడేందుకు రాష్ట్రపతి పాలన విధించడం, సైన్యం సేవలు వాడుకోవడం వంటి చర్యలు చేపట్టరాదని ప్రశ్నించారు.