సిమ్లా: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ ఉత్తర భారతదేశంలో క్రమంగా బలపడుతున్నది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పలు రాష్ట్రాల్లో క్యాడర్ను బలోపేతం చేసుకుంటూ చాపకింద నీరులా దూసుకుపోతున్నది. తాజాగా 2022, నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాచల్ప్రదేశ్పై కూడా ఆప్ దృష్టిసారించింది. ఆ రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దించనున్నట్లు ఆమ్ఆద్మీ పార్టీ హిమాచల్ప్రదేశ్ ఇన్చార్జి రత్నేశ్ గుప్తా తెలిపారు.
ఆప్ తాజా ప్రకటనతో ఆ పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగుతున్న ఆరో రాష్ట్రంగా హిమాచల్ప్రదేశ్ను చెప్పవచ్చు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గుజరాత్, గోవా రాష్ట్రాల్లోని అన్ని అసెంబ్లీ స్థానాల నుంచి తమ అభ్యర్థులు బరిలో దిగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.