హైదరాబాద్ : వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల నం, సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్ జిల్లా మొయిన్పేటలో 31.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పలు చోట్ల పంటలు దెబ్బతినగా.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. పిడుగుపాటుకు ఇద్దరు బలయ్యారు.