న్యూఢిల్లీ: ఇక నుంచి ఆధార్ కార్డుపై మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవడం మరింత సులువుగా మారింది. ఆధార్ హోల్డర్ తన ఇంటి వద్దనే ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చు. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఎఐ) ఆధార్లో మొబైల్ నంబర్ను అప్డేట్ చేయడానికి కొత్త సేవలను ప్రారంభించినట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మంగళవారం ప్రకటించింది.
ఆధార్ హోల్డర్ ఇంటివద్దే మొబైల్ నంబర్ను పోస్ట్మాన్ ఆధార్లో అప్డేట్ చేయనున్నట్లు ఐపీపీబీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న 650 ఐపీపీబీ బ్రాంచీలు.. 1,46,000 పోస్ట్మాన్లు, గ్రామీణ్ డాక్ సేవక్ల ద్వారా ఈ సేవలు అందనున్నాయి. ప్రస్తుతం ఐపీపీబీ మొబైల్ అప్డేట్ సేవలను మాత్రమే అందిస్తోంది. అతి త్వరలోనే ఐపీపీబీ నెట్ వర్క్ ద్వారా పిల్లల నమోదు సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది.
ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్తోపాటు, పోస్ట్మెన్లు, గ్రామీణ్ డాక్ సేవకులు అనేక బ్యాంకింగ్ సేవలను అందిస్తారు. “ఆధార్ సంబంధిత సేవలను సులభతరం చేయడానికి యుఐడీఏఐ తన నిరంతర ప్రయత్నంలో భాగంగా పోస్ట్మాన్, గ్రామీణ్ డాక్ సేవకుల ద్వారా నివాసితుల ఇంటి వద్దే మొబైల్ అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నది.