భువనేశ్వర్: నాగు పాము ఇంట్లోకి ప్రవేశించకుండా.. ఓ పెంపుడు పిల్లి దాన్ని అడ్డుకున్నది. సుమారు 30 నిమిషాల పాటు ఆ రెండింటి మధ్య పోరాటం సాగింది. యాజమాని కుటుంబాన్ని కాపాడేందుకు పిల్లి ఊహించని సాహసమే చేసింది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగింది. బీమతాంగి ప్రాంతంలో ఉన్న సంపద్ కుమార్ ఇంటి పెరట్లోకి నాగు పాము ప్రవేశించింది. అయితే ఇంటి వెనుక నుంచి వస్తున్న ఆ పామును గుర్తించిన పెంపుడు పిల్లి చిన్నూ దాన్ని పెరట్లోనే అడ్డుకున్నది. చిన్నూ అడ్డుగా నిలవడంతో.. ఆ సర్పం పదే పదే బుసలు కొట్టింది. అయినా కదలకుండా చిన్నూ.. ఆ విషనాగుకు ఎదురు తిరిగింది.
ఈ లోగా ఇంటి ఓనర్ సంపద్ కుమార్.. స్నేక్ హెల్ప్లైన్కు ఫోన్ చేశాడు. స్నేక్ వాలంటీర్ అరుణ్ కుమార్ ఇంటికి వచ్చే వరకు పామును ఆ పిల్లి నిలువరించింది. వాలంటీర్ ఆ సర్పాన్ని పట్టుకుని నగరం బయట ఉన్న అటవీ ప్రదేశంలో వదిలేశాడు. అయితే రెండింటి మధ్య దాడి జరిగిన సమయంలో.. పిల్లికి ఏదైనా కాటు పడిందేమో తెలుసుకునేందుకు దానికి పరీక్షలు చేశారు. కానీ చిన్నూ సురక్షితంగా ఉన్నట్లు స్నేక్ హెల్ప్లైన్ అధికారులు చెప్పారు. కుక్కలు, పిల్లులు లాంటి పెంపుడు జంతువులు యజమానులను కాపాడేందుకు వెనుకాడవన్న సత్యాన్ని మరోసారి చాటాయి.