పరిగి, మే 28: కరోనా కట్టడికి సర్కారు అవలంబిస్తున్న విధానాలు దేశానికే తలమానికంగా నిలుస్తున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగిలోని సర్కారు దవాఖానలో సూపర్ స్ప్రెడర్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం ఇటీవల రెండు విడుతల్లో ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి జ్వర సర్వే దేశానికి ఆదర్శంగా మారిందన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ సర్వే కొనసాగుతున్నదని చెప్పారు. కరోనా కట్టడి కోసం సీఎం కేసీఆర్ పలు ఆదర్శనీయమైన విధానాల అమలుకు శ్రీకారం చుడుతున్నారని అన్నారు. సూపర్స్ప్రెడర్లకు ముందుగా టీకాలు ఇవ్వ డం ద్వారా కరోనా కట్టడి మరింత త్వరితగతిన చేపట్టవచ్చని సీఎం కేసీఆర్ కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్కు సూచించారని, ఈ సూచనలను స్వయం గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాగతించారన్నారు. తెలంగాణలో కరోనా కట్టడి చర్యల్లో రాష్ట్రం ముందుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలతో నిత్యం సంబంధాలు గల సూపర్ స్ప్రెడర్లకు టీకాలతో కరోనా వైరస్ వ్యాప్తి చాలావరకు తగ్గనున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఎ.సురేందర్కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, దవాఖాన ఇన్చార్జి డాక్టర్ సత్యనారాయణ, రాఘవాపూర్ సర్పంచ్ నల్క జగన్ పాల్గొన్నారు.
తాండూరులో..
తాండూరు రూరల్, మే 28 : తాండూరు జిల్లా దవాఖానలో శుక్రవారం సూపర్ స్ప్రెడర్స్కు కరోనా టీకా వేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విలేకరులతోపాటు ఆటో డ్రైవర్లు, గ్యాస్ డెలివరీ బాయ్స్, తోపుడు బండ్ల వ్యాపారులకు దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. రేపు కూడా వ్యాక్సినేషన్ సెంటర్లో టీకా వేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పూడూరులో..
పూడూరు, మే 28 : ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్స్కు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించగా, శుక్రవారం 65 మందికి వ్యాక్సిన్ వేశారు. మండల పరిధిలోని జర్నలిస్టులు, రేషన్ డీలర్లు, ఫెర్టిలైజర్, గ్యాస్, పెట్రోల్ డీలర్లు, గ్యాస్ డెలివరీ సిబ్బంది, ఆయా ఎరువుల తయారీ పరిశ్రమలో పనులు చేసే సిబ్బంది మొత్తం 200 మంది ఉన్నారు. పూడూరు మండల కేంద్రంలోనే వ్యాక్సిన్ వేసేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల్లో అందరికీ వ్యాక్సిన్ వేస్తామని, హెల్త్ ప్రోగ్రాం ఆఫీసర్ మౌర్య తెలిపారు. వీరితో పాటు వైద్యుడు సుధాకర్రెడ్డి, ఏవో సామ్రాట్రెడ్డి, సిబ్బంది ఉన్నారు.