చెన్నై: మనిషికి ఎన్ని కిడ్నీలు ఉంటాయి? ఎవరికైనా రెండే ఉంటాయి. కానీ చెన్నైలోని ఓ వ్యక్తికి మాత్రం ఇప్పుడు ఐదు కిడ్నీలు ఉన్నాయి. హైపటెన్షన్తో బాధపడుతున్న ఆ వ్యక్తికి ఒకటి కాదు రెండు కాదు.. మూడుసార్లు కిడ్నీ మార్పిడి ( kidney transplant )శస్త్రచికిత్సలు నిర్వహించారు మద్రాస్ మెడికల్ మిషన్ డాక్టర్లు. దీంతో ఇప్పుడతని శరీరంలో ఐదు కిడ్నీలు ఉన్నాయి.
మూడుసార్లు ఎందుకు?
ఆ వ్యక్తి శరీర కుహరంలో తగినంత ఖాళీ లేకపోవడంతో డాక్టర్లకు ఈ కిడ్నీ మార్పిడి సర్జరీ క్లిష్టంగా మారింది. తాజాగా మూడోసారి జరిగిన ఈ ఆపరేషన్ను డాక్టర్ శరవణన్ నిర్వహించారు. ఆ వ్యక్తి హైపర్టెన్షన్తో బాధపడుతుండటంతో అంతకుముందు చేసిన రెండు ట్రాన్స్ప్లాంట్లు ఫెయిలయ్యాయి. పైగా ఆ పేషెంట్ ఈ మధ్యే బైపాస్ సర్జరీ చేయించుకోవడంతో డాక్టర్లు మరింత జాగ్రత్తగా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రక్రియను చేయాల్సి వచ్చింది.
ఎలా చేశారు?
సాధారణంగా మార్పిడి శస్త్రచికిత్సలో దాత కిడ్నీని అప్పటికే శరీరంలో ఉన్న కిడ్నీ పక్కనే అమరుస్తారు. అయితే ఈ కొత్త కిడ్నీ అమర్చడానికి శరీరంలో తగినంత ఖాళీ ప్రదేశం లేకపోవడం డాక్టర్ల పనిని మరింత సంక్లిష్టంగా మార్చింది. పైగా కొత్త కిడ్నీకి జత చేయడానికి తగినన్ని రక్త నాళాలు కూడా ఆ వ్యక్తి శరీరంలో లేవు. దీంతో సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఈ ట్రాన్స్ప్లాంట్ను మరో విధంగా చేయాల్సి వచ్చింది. ఈ కొత్త కిడ్నీని పేగులకు దగ్గర ఉదర కుహరంలో ఉంచారు. నిజానికి ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత అరుదుగా జరిగే సర్జరీ అని, ఇండియాలో ఇప్పటి వరకూ జరగలేదని డాక్టర్ శరవణన్ చెప్పారు.
పాత కిడ్నీలు ఎందుకు తొలగించలేదంటే..
మరి అంతకుముందు అమర్చిన రెండు కిడ్నీలను ఎందుకు తొలగించలేదు అన్నదాని వెనుక కూడా ఒక కారణం ఉందని డాక్టర్లు వివరించారు. వాటిని తొలగిస్తే పేషెంట్కు అధిక రక్త స్రావం జరగొచ్చు. దీంతో రక్త మార్పిడి అవసరం అవుతుంది. ఇది యాంటీబాడీలకు దారి తీసి అవి కొత్త కిడ్నీని తిరస్కరించే అవకాశం ఉండటంతో వాటిని అలాగే ఉంచి మూడోది అమర్చినట్లు డాక్టర్లు వెల్లడించారు.