భోపాల్: మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన రెండు ఘటనలు ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీపై ఉప ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశమున్నట్లు తెలుస్తున్నది. దీంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అప్రమత్తమయ్యారు. నష్ట నివారణ చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 16న అర్థరాత్రి సాగర్ జిల్లా సెమ్రా లెహరియా గ్రామంలో 25 ఏండ్ల రాహుల్ యాదవ్కు కొందరు నిప్పుపెట్టారు. అయితే తాను ప్రేమించిన యువతికి చెందిన బ్రాహ్మణ కుటుంబం తమ ఇద్దరిపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారంటూ మరణానికి ముందు రికార్డు చేసిన వీడియోలో అతడు పేర్కొన్నాడు. యువతి తండ్రి, ఆమె సోదరుడు, మరో ఇద్దరు ఈ ఘటనకు పాల్పడినట్లు అందులో ఆరోపించాడు.
కాగా, రాహుల్ యాదవ్ మరణంపై ఓబీసీ వర్గం ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సాగర్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే భుపేంద్ర సింగ్, ఆ బాహ్మణ కుటుంబం ఇంటి కూల్చివేతకు మద్దతుగా నిలిచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి లక్ష పరిహారం ప్రకటించారు. రాహుల్ యాదవ్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు రాహుల్తోపాటు కాలిన గాయాలైన బ్రాహ్మణ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. అయితే, మరణానికి ముందు రాహుల్ చేసిన ఆరోపణలను ఆమె ఖండించింది. రాహుల్ తనపై పెట్రోల్ పోసి నిప్పటించే క్రమంలో ప్రమాదవశాత్తు అతడికి మంటలు అంటుకున్నాయని తెలిపింది. తన తల్లిదండ్రులు ఇద్దరిని రక్షించేందుకు ప్రయత్నించారని మేజిస్టేట్ ఎదుట ఇచ్చిన స్టేమ్మెంట్లో ఆమె పేర్కొంది.
దీంతో సాగర్లోని బ్రాహ్మణ వర్గం ప్రజలు బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఇంటి కూల్చివేతకు మద్దతిచ్చిన ఎమ్మెల్యే భుపేంద్ర సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. త్వరలో జరుగనున్న ఒక ఎంపీ, మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు లక్ష మందితో ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఉన్నత వర్గం ఆగ్రహంపై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. కాలిన గాయాలైన యువతికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సాగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.