జడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలి
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
టీఆర్ఎస్లో పలువురి చేరిక
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 21 : గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్ సర్కారుతోనే సాధ్యమవుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని పొచ్చెర, అల్లికోరి గ్రామాల మాజీ సర్పంచ్లు అల్లూరి రమేశ్రెడ్డి, లక్ష్మణ్, సుశీలతో పాటు కాంగ్రెస్, బీజేపీ నాయకులు టీఆర్ఎస్లో చేరారు. కాగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 70 ఏళ్లలో లేని గ్రామాల అభివృద్ధి టీఆర్ఎస్ సర్కారు వచ్చిన ఆరేళ్లలో చేసిందన్నారు. గ్రామాల్లో ఉన్న పేదల కోసం డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. చాలా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు లేక నిర్మాణం చేపట్టడంలేదన్నారు. ఈ ఏడాది నుంచి సొంత స్థలం ఉన్న వారందరికీ డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరుచేస్తామని తెలిపారు. అలాగే పొచ్చెర, రాంపూర్, జందాపూర్ గ్రామాల్లోని నిరుపేద ఎస్సీలకు దళిత బస్తీ కింద ఇతర ప్రాంతాల్లో భూములు ఇచ్చేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. ఆయా గ్రామాల్లోని రైతులు ఎవరైనా భూమలు అమ్మేందుకు సిద్ధంగా ఉంటే సీఎం కేసీఆర్తో మాట్లాడి, నిధులు ఎక్కువైనా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఆరె నరేశ్ కుమార్ను గెలిపించాలని కోరారు. గ్రామాల్లో అభివృద్ధి మరింత జోరందుకుంటుందన్నారు. మండలంలోని ప్రజలు కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మకుండా టీఆర్ఎస్ అభ్యర్తికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఆత్మ చైర్మన్ జిట్ట రమేశ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి ఆరె నరేశ్ కుమార్, దిమ్మ సర్పంచ్ కొండ గంగన్న, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ సోనేరావ్, నాయకులు సెవ్వ జగదీశ్, భోజారెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు సాయం అభినందనీయం..
పేద ప్రజలకు సాయం చేసేందుకు ఆదిలాబాద్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే రామన్న అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని షాద్నగర్లో పేదలకు సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ముస్లింలకు పండుగ గిఫ్ట్లను త్వరలో పంపిణీ చేస్తామన్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు యూనిస్ అక్బానీ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.