న్యూఢిల్లీ: ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే లక్షల్లో మాటే. చిన్నవి రెండు రేకుల రూమ్లు కట్టుకోవాలన్నా ఖర్చు కనీసం రూ.5 లక్షలు దాటుతుంది. ఈ స్లాబ్ వేసి బంగళా కట్టుకోవాలంటే పాతిక లక్షలు దాటుతుంది. ఇక స్థలం కొని కట్టుకోవాలంటే అక్షరాల అరకోటి వదిలించుకోవాల్సిందే. అలాంటిది క్రొయోషియాలోని ఓ నగర పాలక సంస్థ మాత్రం కేవలం రూ.12కే ఒక ఇల్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నది. మరి ఆ ఆఫర్ గురించి మనం కూడా తెలుసుకుందాం..?
క్రొయేషియా దేశంలోని లెగ్రాడ్ నగరం గత కొన్నేళ్లుగా ప్రజలు లేక వెలవెలబోతున్నది. లెగ్రాడ్ ప్రజలు సమీపంలోని పెద్ద నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. దాంతో గత వందేళ్లుగా జనాభా తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ లెగ్రాడ్ పట్టణాన్ని ప్రజలతో కళకళలాడేలా చేయాలని అక్కడి నగర పాలక సంస్థ నిర్ణయించుకుంది. అందుకే సరికొత్త ప్లాన్తో ప్రజల ముందుకొచ్చింది. ఆ నగరంలోని అత్యంత విలాసవంతమైన ఇళ్లను కేవలం రూ.12కే విక్రయిస్తున్నది.
అంతేకాదు, ఇల్లు కొన్న వారికి ఆ ఇంటి రిపేర్ కోసం లెగ్రాడ్ పాలక యంత్రాంగం రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం కూడా చేస్తుంది. అయితే అక్కడ ఇంటిని కొనే వారికి కొన్ని షరతులను విధిస్తున్నది. అవేమిటంటే.. అక్కడ ఇళ్లు కొనే వారు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండాలి. అలాగే 40 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. అలాగే లెగ్రాడ్లో కనీసం 15 ఏళ్ళు నివసిస్తామని హామీ పత్రం రాసివ్వాలి. ఈ షరతులతో లెగ్రాడ్ పాలకమండలి ఇప్పటివరకు 17 ఇళ్లను అమ్మినట్టు అక్కడి మేయర్ తెలిపారు.