భోపాల్: బిడ్డను కడుపులో మోస్తున్నన్ని రోజులు తల్లి ఎంతో సంబరపడిపోతుంది. తాను ఒక జీవికి జన్మను ఇవ్వబోతున్నాన్న అనుభూతితో మురిసిపోతుంది. డెలివరీ సమయం దగ్గరవుతున్నా కొద్దీ ఆ మురిపెం అంతకంతకే పెరిగిపోతుంది. కాన్పు నాడు భరించలేని పురిటినొప్పులతో నరకయాతన అనుభవించినా.. తాను జన్మనిచ్చిన బిడ్డను ముద్దాడి ఆ నొప్పిని క్షణాల్లో మరిచిపోతుంది.
కానీ, మధ్యప్రదేశ్ రాష్ట్రం హర్దా జిల్లాలో నవ మోసాలు మోసి ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి మాత్రం ఆ ముద్దూ మురిపెం ఏవీ లేకుండా పోయాయి. పైగా జీవితాంతం తన బిడ్డను చూస్తూ బాధపడాల్సిన దుస్థితి దాపురించింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. బుధవారం హర్దా జిల్లాలోని గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో డెలివరీ అయిన ఓ మహిళకు కేవలం 1.6 కేజీల బరువుతో, పైగా మోకాళ్లకు దిగువన పూర్తిగా వంకర్లు పోయిన కాళ్లతో ఆడబిడ్డ జన్మించింది.
దాంతో తన దివ్యాంగ శిశువును చూసుకుని ఆ మహిళ కుమిలి కుమిలి ఏడ్చింది. ఆమె కుటుంబసభ్యులు కూడా శిశువును చూసి బాధను దిగమింగుకుంటున్నారు. కాగా, ప్రత్యేక లక్షణాలతో జన్మించిన శిశవును స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ శిశువు చికిత్స అయ్యే ఖర్చును రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యాక్రమం కింద మధ్యప్రదేశ్ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.