తిరువనంతపురం: కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఓ ప్రైవేటు వైద్యుడికి జికా వైరస్ సోకింది. ఈ విషయాన్ని కేరళ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి వెల్లడించారు. తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న 38 ఏండ్ల వ్యక్తికి జికా వైరస్ సోకినట్లు వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయ్యిందని ఆమె తెలిపారు. కాగా, తాజా కేసుతో కలిపి కేరళలో ఇవాళ కొత్తగా ముగ్గురికి జికా వైరస్ సోకినట్లయ్యింది. ఇప్పటికే ఇవాళ పూంతూర గ్రామానికి చెందిన ఓ 35 ఏండ్ల వ్యక్తికి, శాస్తమంగళం గ్రామానికి చెందిన మరో 41 ఏండ్ల వ్యక్తికి జికా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇవాళ్టి మూడు కేసులతో కలిపి కేరళలో ఇప్పటివరకు మొత్తం 22 మంది జికా వైరస్ సోకినట్లయ్యింది.