మల్లన్న, కొండపోచమ్మ సాగర్రిజర్వాయర్లతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం
కొండపోచమ్మ సాగర్ ప్రారంభించి సంవత్సరం అయినందున అమ్మవారికి ప్రత్యేక పూజలు
కొండపోచమ్మ సాగర్తో వేలాది ఎకరాలకు సాగునీరు..
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
గజ్వేల్ అర్బన్, జగదేవ్పూర్, మే 29 : మల్లన్న, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లతో తెలంగాణ పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం కానున్నదని, గత సంవత్సరం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కొండపోచమ్మ సాగర్ రిజార్వయర్తో వేలాది ఎకరాలకు సాగు నీరందించిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జగదేవ్పూర్ మర్కూక్ మండలాల నాయకులతో కలిసి ఎఫ్డీసీ చైర్మన్ తీగుల్ నర్సాపూర్ కొండపోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కండపోచమ్మ జలాశయం వద్ద గోదారి జలాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ కొండపోచమ్మ జలాశయాన్ని వేగంగా పూర్తి చేసి ప్రారంభించడంతో కొత్తగా వేలాది ఎకరాల భూమి సాగులోకి వచ్చిందన్నారు. పంటలకు సాగునీరు పుష్కలంగా అందడంతో గజ్వేల్ నియోజకవర్గంలోని బీడు భూములన్నీ పచ్చని పంటలతో సస్యశ్యామలం అయ్యాయన్నారు. కొండపోచమ్మ జలాశయం నుంచి గోదారి జలాలు సంగారెడ్డి కెనాల్ ద్వారా కూడవెల్లి వాగు నుంచి 96 కి.మీటర్లు ప్రయాణించి 34 చెక్ డ్యాంలను నింపుతూ అప్పర్ మానేరు నిండుకుండలా మారిందని తెలిపారు. 96కి.మీటర్లు గోదారి జలాల ప్రయాణంలో ఘనపురం ఆయకట్టు, సింగూరు జలాశయం నిండుకొని నిజాంసాగరోకి 4 టీఎంసీలు చేరిందన్నారు. కొండపోచమ్మ జలాశయం ద్వారా గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, కామారెడ్డి, భాన్సువాడ సిరిసిల్ల, నియోజకవర్గాలకు సాగు నీరందిస్తున్నామన్నారు. జిల్లాలోని మరో పెద్ద జలాశయం మల్లన్న సాగర్ 98శాతం పనులు పూర్తయ్యాయని, రెండు మూడు నెలల్లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.
రెండు జలాశయాల ద్వారా రాష్ట్రం నలుమూలలకు సాగునీరు అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అని, ప్రజలందరి ఆశీర్వాదంతో త్వరలోనే సీఎం సంకల్పం నెరవేనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలోనే 5 లక్షల క్వింటాళ్ల ధాన్యం పండిందంటే ఇతర నియోజకవర్గాలలో ఎంత ధాన్యం పండిందో అంచనా వేయొచ్చన్నారు. హల్దీ, కూడవెల్లి వాగులతో కొండపోచమ్మ జలాశయం ద్వారా నీరు అందించడంతో లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలిగిందన్నారు. వేలాది మంది రైతులకు ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆయన వెంట గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసుఅన్నపూర్ణ శ్రీనివాస్, నాచారం, కొండపోచమ్మ దేవాలయ చైర్మన్లు హరిపంతులు, ఉపేందర్రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గుండారంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మర్కూక్ మండల అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి, తీగుల్ నర్సాపూర్ సర్పంచ్ రజిత రమేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుధాకర్రెడ్డి, నాయకులు రాందాస్గౌడ్, రమేశ్, స్వామి, చారి ఉన్నారు.