న్యూఢిల్లీ, జూలై 30: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో బాలికలు మెరిశారు. బాలురతో పోలిస్తే 0.54 శాతం ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు సీబీఎస్ఈ శుక్రవారం ఫలితాలు విడుదల చేసింది. రికార్డు స్థాయిలో మొత్తం 14.30 లక్షల మంది విద్యార్థులు (99.37 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది ఉత్తీర్ణత శాతంతో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఈ ఏడాది పరీక్షలను రద్దు చేశామని, దీంతో మెరిట్ లిస్ట్ను ప్రకటించలేదంటూ సీబీఎస్ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సన్యమ్ భరద్వాజ్ తెలిపారు. 6,149 మంది విద్యార్థులను కంపార్ట్మెంట్ క్యాటగిరీలో పెట్టినట్టు పేర్కొన్నారు. వీరికి ఆగస్టు 16-సెప్టెంబర్ 15 మధ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లోని విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు.
కొత్త పాఠశాలల్లో జాప్యం
65,184 మంది విద్యార్థుల ఫలితాలను సీబీఎస్ఈ పెండింగ్లో ఉంచింది.1,060 కొత్త పాఠశాలల్లో మూల్యాంకనంలో జాప్యంతో ఆ విద్యార్థుల ఫలితాలు ప్రకటించలేదని, ఆగస్టు 5లోపు ప్రకటిస్తామని భరద్వాజ్ తెలిపారు.