న్యూఢిల్లీ, జూలై 19: చమురు ఉత్పత్తుల ధరలపై కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న వసూళ్లు 2021-22 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, సహజవాయువుపై ఎక్సైజ్ సుంకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు నెలల్లోనే రూ. 94,181 కోట్లు వసూలయ్యాయి. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.35 లక్షల కోట్లు ఎక్సైజ్ సుంకాలు వసూళ్లు అయినట్టు (గతంతో పోల్చితే 88 శాతం ఎక్కువ) పార్లమెంటులో పెట్రోలియం, సహజవాయువులు శాఖ సహాయ మంత్రి టీ రామేశ్వర్ మంగళవారం తెలిపారు. గతేడాది పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ. 19.98 నుంచి రూ. 32.9 లకు పెంచగా.. డీజిల్పై లీటరుకు రూ. 15.83 నుంచి రూ. 31.8 కి పెంచారు. దీంతో 2020-2021 ఆర్థిక సంవత్సరాని (మార్చి 31 నాటికి)కి గాను రూ. 3.35 లక్షల కోట్లు వసూళ్లు అయ్యాయని చెప్పారు. ఇవి అంతకుముందు ఏడాదిలో రూ.1.78 లక్షల కోట్లుగా ఉన్నాయి.