గువహటి : అసోంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దిబ్రుఘర్ జిల్లాలోని జలోని టీ ఎస్టేట్లో 90 మంది వర్కర్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆ టీ గార్డెన్ను కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు. టీ గార్డెన్ లోపల ఉన్న వ్యక్తులను బయటకు రానివ్వడం లేదు. స్థానికంగా ఉన్న ఆస్పత్రితో పాటు స్టాఫ్ క్వార్టర్స్ను తాత్కాలిక ఐసోలేషన్ సెంటర్లుగా మార్చారు. గార్డెన్ పరిసరాలను శానిటైజ్ చేసి, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ నబజ్యోతి గోగోయ్ తెలిపారు.
ఇక ఈ గార్డెన్లకు సమీపంలో ఉన్న వారాంతపు సంతలను కూడా తాత్కాలికంగా రద్దు చేయాలని అధికారులు ఆదేశించారు. తమకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని టీ గార్డెన్లలో పని చేసే కార్మికులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. అసోంలో బుధవారం ఒక్కరోజే 55 మంది కరోనాతో చనిపోయారు. మృతుల సంఖ్య 1,485కు చేరింది. నిన్న 4,826 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,72,751కి చేరింది.