హైదరాబాద్ : తెలంగాణలో పట్టణ, స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఖాళీ అయిన పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. వరంగల్, ఖమ్మం, అచ్చంపేట పాలకమండళ్ల పదవీకాలం పూర్తికావడంతో ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకమండలి గడువు ఈ నెల 15న ముగియనుంది. కొత్తగా ఏర్పాటైన కొత్తూరు సహా జడ్చర్ల, నకిరేకల్ మున్సిపల్కు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీకి ఇప్పటికే ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేశారు.
పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు సైతం షెడ్యూల్ ప్రకటించారు. మరో ఎనిమిది మున్సిపాలిటీల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు షెడ్యూల్ జారీ అయ్యింది. బుధవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ఎన్నికల కమిషన్ తయారు చేయనుంది. గురువారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా ప్రకటించనున్నారు. ఈ నెల 11 వరకు అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారాలు చేపట్టనున్నారు. ఈ నెల 14న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించనున్నారు. కొనసాగుతున్న ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్లు, అధికారులతో ఎస్ఈసీ పార్థసారధి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు.
అలాగే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎన్నికలు నిర్వహించాల్సిన, ఖాళీగా ఉన్న వివిధ స్థానిక సంస్థల పదవులకూ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధమైంది. ఈ మేరకు సంబంధిత ప్రక్రియను సైతం ప్రారంభించింది. ఓ జడ్పీటీసీతో పాటు 60 ఎంపీటీసీ, 125 సర్పంచ్ స్థానాలు, 2288 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఆయా స్థానాల్లో వార్డుల వారీ ఓటర్ల తయారీకి ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 12వ తేదీన ఓటర్ల తుది జాబితాలు ప్రకటించనుంది. ఆ తర్వాత పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసి ఆ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.