ముంబై: తల్లి మరణించగా పక్కనే ఉన్న ఏడాదిన్నర బాబు రెండు రోజులపాటు నీరు, ఆహారం లేక ఆకలితో అలమటించాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. పింప్రిలోని చిన్చివాడ్ ప్రాంతంలో ఉంటున్న ఒక మహిళ శనివారం చనిపోయింది. ఆమె భర్త పని కోసం ఉత్తరప్రదేశ్కు వెళ్లాడు. దీంతో ఆ మహిళ ఇంట్లో మరణించిన సంగతి రెండు రోజుల వరకు ఎవరికీ తెలియలేదు.
చివరకు యజమాని పోలీసులకు సోమవారం సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఇంటి తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. లోపల చనిపోయి ఉన్న మహిళ, ఆమె పక్కన ఏడాదిన్నర వయసున్న బాబును చూశారు. ఆమె కరోనాతో చనిపోయి ఉంటుందని అనుమానించిన స్థానికులు రెండు రోజులుగా ఆకలితో ఉన్న బాబును చేరదీసేందుకు ముందుకు రాలేదు.
కాగా, పరిస్థితిని గమనించిన మహిళా కానిస్టేబుళ్లు సుశీలా గభాలే, రేఖా వాజ్ ఆ పసిబిడ్డకు పాలు, బిస్కెట్లు ఇచ్చి ఆకలి తీర్చారు. బాబుకు జ్వరంగా ఉండటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా పరీక్ష చేయించగా నెగిటివ్గా రిపోర్ట్ వచ్చింది. అనంతరం బాబును శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
మరోవైపు తల్లి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె కరోనాతో చనిపోయిందా లేదా అన్నది రిపోర్ట్ తర్వాత తెలుస్తుందని పోలీసులు తెలిపారు. యూపీలో ఉన్న భర్తకు ఆమె మరణ సమాచారాన్ని తెలియజేశారు.