న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: కరోనా ఉద్ధృతి, ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిపై అధికారులు ఈ సందర్భంగా మోదీకి వివరించారు. ద్రవ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం గతేడాది ఆగస్టులో రోజుకు 5,700 టన్నులు ఉండగా, ఇప్పుడు అది 8,922 టన్నులకు పెరిగిందని తెలిపారు. ఏప్రిల్ చివరికల్లా 9,250 టన్నులకు చేరుతుందని చెప్పారు. ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఆక్సిజన్ ట్యాంకర్ల వివరాలను తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయమై పనిచేయాలని మోదీ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.