దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొవిడ్ పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల్లో కేవలం 10 రాష్ట్రాల్లో నమోదైన కేసులే 85 శాతం ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది.
11 రాష్ట్రాల్లో లక్షకు పైగా యాక్టివ్ కరోనా కేసులు ఉండగా ఎనిమిది రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష మధ్య యాక్టివ్ కేసులు ఉన్నాయని మంత్రిత్వశాఖ వెల్లడించింది. 24 రాష్ట్రాల్లో కొవిడ్-19 పాజిటివిటీ రేటు 15 శాతానికి పైగా ఉందని పేర్కొంది. భారత్లో ఒక్కరోజే 3,26,098 కొవిడ్ కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. తాజాగా మరో 3,890 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణించిన వారి సంఖ్య 2,66,207కు పెరిగింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 83.83 శాతానికి మెరుగుపడింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 36,73,802కు తగ్గాయి.