తిరువనంతపురం: కేరళకు చెందిన 84 ఏళ్ల తండమ్మ పప్పు అనే మహిళ.. 30 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు కోవిడ్ టీకా తీసుకున్నది. రెండు సార్లూ ఆమె కోవీషీల్డ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎర్నాకుళం జిల్లాలోని అలువా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్నది. కుమారుడితో కలిసి హాస్పిటల్కు వెళ్లిన ఆ బామ్మ ఓ రూమ్లోకి వెళ్లి మొదట టీకా తీసుకున్నది. అయితే గేటు బయటకు వచ్చిన తర్వాత రూమ్ వద్ద చెప్పులు మరిచిపోయినట్లు ఆమెకు గుర్తు వచ్చింది. దీంతో మళ్లీ ఆ రూమ్ వద్దకు చెప్పుల కోసం వెళ్లింది. అయితే ఆ సమయంలో ఓ మహిళా అధికారి తనను లోపలికి తీసుకువెళ్లిందని, తాను చెప్పేది ఆమె వినిపించుకోలేదని, మరోవైపు ఓ నర్సు వచ్చి తనకు మళ్లీ టీకా వేసినట్లు తండమ్మ పప్పు చెప్పింది. అరగంట తేడాలోనే రెండు టీకాలు తీసుకున్నట్లు అధికారులకు చెప్పడంతో వాళ్లు హైరానా పడ్డారు. గంట సేపు మళ్లీ ఆమెను అబర్జ్వేషన్లో పెట్టారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా అధికారులు ఆమె క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ బామ్మ ఆరోగ్యం బాగానే ఉన్నది.