హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వం తొలి ఎజెండా. ఇందుకోసం ఏం చేయడానికైనా సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉంటారు. ఇతర రాష్ర్టాల్లో సీఎంలు రైతులను పట్టించుకోకుండా గాలికొదిలేస్తుంటే.. ఇక్కడ మాత్రం ఆయన కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణే ధాన్యం కొనుగోళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మార్కెటింగ్ సమస్య రావొద్దనే ఉద్దేశంతో గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మరీ ధాన్యం కొంటున్నది. గత ఏడేండ్ల కాలంలో ప్రభుత్వం రైతుల నుంచి రూ. 84 వేల కోట్ల విలువైన సుమారు 5 కోట్ల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఒక్క గతేడాదే ఏకంగా 1.42 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం విశేషం. ఈ తరహా ధాన్యం కొనుగోలు మరే రాష్ట్రంలోనూ జరగకపోవడం గమనార్హం. ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రంలో పోయడమే ఆలస్యం.. వడ్లు కాంటకు ఎక్కేస్తయి. ధాన్యం ఎక్కువగా ఉంటే ఒక రోజు మహా అయితే రెండు రోజుల సమయం పడుతుంది. గంటల వ్యవధిలో వడ్ల కాంటా.. కాంటా అయిన 2-3 రోజుల్లోనే రైతు ఖాతాల్లో పైసలు జమైతయి. మధ్యవర్తుల సతాయింపులు ఉండవు. కష్టించి పంట పండించిన రైతుకు.. ఆ పంట అమ్ముకోవడంలో ఇబ్బందులు రావొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఇలాంటి చర్యలు తీసుకున్నారు.