కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుతగా కంటోన్మెంట్స్ బిల్-2020 బిల్లును తీసుకురావాలని భావించినా, ప్రస్తుత తరుణంలో వీలుపడే అవకాశం కనబడటం లేదు. పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి అమలు చేయాలని చూసినా అది సాధ్యపడలేదు. ఈ క్రమంలో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే కంటోన్మెంట్ పరిధిలోని వార్డుల వారీగా రిజర్వేషన్లకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో బిల్పై నీలినీడలు కమ్ముకున్నాయి. గెజిట్లో కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు లేదా ఎన్నికల నిర్వహణకు వరకు రిజర్వేషన్లు గతంలో మాదిరిగా ఎన్నికలు నిర్వహించే సమయం ఎక్కువగా ఉంటే నామినేటెడ్ సభ్యుడిని వెరీడ్ బోర్డుగా మారిన కంటోన్మెంట్లకు నియమించేది. కాని, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ముగిసినప్పటికీ కంటోన్మెంట్ యాక్టు బిల్లును పార్లమెంట్లో పెట్టకపోవడం గమనార్హం. అయితే, ఈ దశలోనే సమావేశాల్లో లోక్సభలో ఓ సభ్యుడు కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి కంటోన్మెంట్ బోర్డుల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, జూలై 25వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. దీంతో ఒక్కసారిగా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల నిర్వహణకే రక్షణ శాఖ సుముఖంగా ఉందని తేలడంతో నామినేటెడ్ సభ్యుడి నియామకం చేపట్టే అవకాశం లేనట్లు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డులపై తీసుకుంటున్న నిర్ణయంతో ఏడాది పాటు నామినేటెడ్ పదవి దక్కుతుందని ఎదురుచూస్తున్న కమల నేతల ఆశలకు గండి పడినట్లు అర్థమవుతుంది. ఇప్పటికే వార్డుల రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్ విడుదల చేయగా, పార్లమెంట్ సమావేశాలు ముగిసిన క్రమంలో బిల్లు ప్రవేశ పెట్టకపోవడంతో పాత పద్ధతిలోనే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మరోవైపు రెండేళ్లుగా నిలిచిపోయిన కంటోన్మెంట్ ఓటరు జాబితా సవరణను సైతం ఇటీవలే మళ్లీ ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటిస్తామని అధికారులు పేర్కొనడంతో రాజకీయ నేతల్లో కదలిక వస్తుంది. నామినేటెడ్ పదవిపై నూతనంగా కమలం పార్టీలోకి చేరిన పలువురు నేతలకు నోటిలో పచ్చి వెలక్కాయ పడ్డట్లు తెలుస్తోంది. జూలై 25వ తేదీలోపు ఎన్నికలకు సంబంధించిన అంశాలపై త్వరలోనే రక్షణ శాఖ ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతుంది. నామినేటెడ్ పదవి కోసం ఢిల్లీకి చక్కర్లు కొట్టిన నేతలతో పాటు ఇక్కడే ఉండి చక్రం తిప్పుతున్నామని చెబుతున్న నేతలు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కొంత మంది బీజేపీ నేతలు మాత్రం ఇప్పటికే తమ పేరుపై లేఖలు తయారయ్యాయని, పేరును ప్రకటించడమే తరువాయని చెప్పుకుంటున్న నేతల ముఖాలు సైతం వాడిపోయాయి. చూడాలి మరి.. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో చెప్పిన విధంగా జూలై 25లోపు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరుగుతాయో లేదో వేచి చూద్దాం!